💥1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.

1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాళెగాండ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకడు. కంపెనీ దొరతనము ఎదిరించి వీరమరణం పొందినాడు. ఈయన పాలెగార్ మనవడు.

ప్రారంభ చరిత్ర

18వ శతాబ్దపు తొలిదినాల్లో రాయలసీమలో పాలెగాళ్ళ వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోనే 80 మంది పాలెగాళ్ళుండేవారు.నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిషు వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు బ్రిటిషు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిషు ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది.
ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలెగాడుగా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు, నొస్సం జమీదారు అయిన చెంచుమల్ల జయరామిరెడ్డి నిస్సంతు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల, 10 అణాల, 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన, జయరామిరెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దుచేసింది బ్రిటిషు ప్రభుత్వం.
నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామములో జన్మించి, ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాధల వలన తెలుస్తున్నది. ఈయన కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుళ్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఈయన నిర్మించిన కోటలు, నగరులు ఈనాటికీ ఉన్నాయి.
నరసింహారెడ్డి తల్లి నీలమ్మ ఉయ్యాలవాడ నగరికాపు అయిన పెదమల్లారెడ్డి రెండవ భార్య. ఈమె నొస్సం జమేదారు చెంచుమల్ల జయరామిరెడ్డి చిన్నకూతురు. నరసింహా రెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సిద్దమ్మ వలన కొడుకు దొర సుబ్బయ్య జన్మించాడు. రెండవ భార్య పేరమ్మ వలన ఒక కూతురు, మూడవ భార్య ఓబులమ్మ వలన ఇద్దరు కుమారులు జన్మించారు.
నరసింహారెడ్డి దగ్గర ఓబళాచార్యుడు అను ఆస్థానకవి ఉండెడని తెలియుచున్నది. ఈ ఓబళాచార్యుడు ఆకాలమున కర్నూలు మండలమున ప్రసిద్దికెక్కిన కృష్టిపాటి వేంకటకవికిని నశ్యము నిమిత్తమై సంభాషణాత్మకముగా జరిగిన రెండు పద్యాలను వేటూరి ప్రభాకరశాస్త్రి గారు తమ చాటుపద్యమణిమంజరిలో ఇచ్చియున్నారు.ఒకప్పుడు వేంకటసుబ్బయ్య కవి నారసింహారెడ్డి ఆస్థానమునకు వచ్చెను. రెడ్డి గారు ఆయనని సత్కరించి, కావ్యగాన మొనర్చవలసినదిగా ప్రార్ధించెను.

తిరుగుబాటు ప్రారంభం

1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపగా, అక్కడి తహసిల్దార్, ఆ వ్యక్తిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. నరసింహారెడ్డి తాతయగు జయరామిరెడ్డి కాలములోనే అనగా క్రీ.శ.1800 లోనే అంగ్లేయులు నొస్సం సంస్థానమును లోబరుచొకొని, ఈ రాజవంశానికి నెలకు 11 రూపాయలు భరణము ఏర్పాటుచేసిరి. క్రీ.శ. 1845 వరకు ఈ భరణము నరసింహారెడ్డి కు నచ్చుచుండెను. ఆసంవత్సరము నరసింహారెడ్డి తనకు రావలసిన భరణము కొరకై కోయిలకుంట్ల తహసిల్దారుకు తన భటునుని (కొందరు భటునుని కాక తన కొడుకు దొరసుబ్బయ్యను పంపెనని చెప్పుదురు) పంపెను. ఆ తహసిల్దారు అది ఈయకుండా నరసింహారెడ్డి పై దుర్భాషలాడెను.ఆ భటుడు ఉయ్యాలవాడకు పోయి జరిగిన విషయము తెలిపెను. అది విన్న నరసింహారెడ్డి అట్టి అవమానము వినకుండా చచ్చుట మేలు అని తలంచెను. అప్పుడు అదే భటునితో నేనే వచ్చెదనని తహసిల్దారుకు కబురుపంపినాడు.
మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందార్లు, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరినవారిలో ఉన్నారు.
1846 జూలై 10వ తేదీన రెడ్డి 500 మంది బోయసైన్యమును దీసికొని, పట్టపగలు కోయిలకుంట్ల పట్టణముపై దండెత్తెను. తహసీల్దారుని పట్టి తలకొట్టి, ధనాగారములోనున్న బొదెలవాడు హరిసింగు ను జంపి, దానిని దోచుకొని, కచ్చేరీ నంతయు దగ్ధము చేసి తహసిల్దారు శిరస్సును, హర్సింగు శిరస్సును తెచ్చి నొస్సం దగ్గరనున్న నయనాలప్ప కొండ లో గల ఒక శివాలయము గుహలో దాచినాడు. కడపలో నున్న కలెక్టరునకును, పోలీసు సూపరిండెంటునకు ఈ హత్యావిషయము తెలిసి, అన్వేషణ ప్రారంభించిరి. వారు రెడ్డి ని ప్రశ్నించగా రెడ్డి తనకేమీ తెలియదనియు, బహుశ ఔకరాజగు నంద్యాల నారాయణరాజును, వారి బంధువు నంద్యాల వెంకటరమణరాజును బంధించి కారాగారములో నుంచిరి. అపరాధ పరిశోధకులు తరువాత శివలయములో నున్న శిరస్సులను కొనిగొనిరి. రెడ్డి గారి అనుచరులగు గోసాయివెంకన్న, ఒడ్డెఓబన్న అనువారలను బందించి సత్యమును కనుగొనిరి.
బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టి ఇచ్చినవారికి వేయిరూపాయల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది. అటుపై, నారసింహారెడ్డి వేలకొలది సైన్యములను సమకూర్చుకొని గిద్దలూరు దగ్గర వాట్సన్‌ తో ఘోర యుద్ధము చేసెను. రెడ్డి తన సైన్యముంతయు నష్ఠముకాగా, నల్లమల కొండలలోనికి తప్పించుకొని పారిపోయెను. ఆంగ్లేయులు ఆతనిని పట్టుకొనుటకు ఎన్నియో ప్రయత్నములు చేసిరి.కాని ఫలించలేదు.
తరువాత జూలై 23న తేదీన మరలా కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్ధరాత్రి రెడ్డి, తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదుచేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు రెడ్డి. 1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని పేరుసోమల వద్దగల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించ దలచెను.నారసింహారెడ్డి కడ ఒక వంటమనిషి ఉండెను.బ్రిటీషువారు ఆమెకు లంచమిచ్చి నారసింహారెడ్డి ని పట్టుకొనిరి. ఆవంట మనిషి నారసింహారెడ్డికి విపరీతముగా సారాయి పట్టించి ఆతని తుపాకీలో నీళ్ళు పోసి ఉంచినదట. ఆసమయములో నారసింహారెడ్డిని బంధించి కోయిలకుంట్ల కు తెచ్చినుంచిరి.

వీరమరణం

నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో ఔకు రాజు తమ్ముడొకడు.[1]
కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిషు ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.

ఒక పాట

ఈ నారసింహారెడ్డి పై ప్రజలలో రెండు వీరగాధానికలును, ఒక వీరగాధయు వ్యాప్తి యందు ఉన్నవి. దొరవారి నరసిం హ్వ రెడ్డి! నీ దొరతనము కూలిపోయె రాజా నరసిం హ్వ రెడ్డి అనే కోలాటపు పాటను డాక్టర్ తూమాటి దోణప్ప గారు అనంతపుర మండలమున సంపాదించిరి. డాక్టర్ తంగిరాల వేంకటసుబ్బారావు గారు "వొహువా! నరసింహారెడ్డి! నీ పేరంటే రాజా నరసింహారెడ్డి! అను పిచ్చుకుంట్ల పాటను వీరు సంపాదించిరి. ఈ రెండును లఘువీరగాధలు. ఇవి కాక బొబ్బిలి పాట వరుసలోనున్న పెద్దవీరగాధయు ఒకటి కలదు.ఇందు కొన్ని విషయములు కొంత భేధముతో కలవు.

దొరవారి నరసిం హ్వ రెడ్డి!
నీ దొరతనము కూలిపోయె రాజా నరసిం హ్వ రెడ్డి! || దొర ||
రేనాటి సీమలోనా రెడ్డోళ్ళ కులములోనా
దొరవారీ వమిశానా ధీరుడే నరసిం హ్వ రెడ్డి || దొర ||
కొయిల్ కుంట్లా గుట్టలేంటా కుందేరూ వొడ్డులెంటా
గుర్రమెక్కీ నీవు వస్తే కుంపిణీకీ గుండె దిగులూ || దొర ||
కాలికీ సంకెండ్లు వేసీ చేతీకీ బేడీలు వేసీ
పారాతో పట్టి తెచ్చీ బందికానులొ పెట్టిరీ || దొర || (పారాతో = పహరా తో)
కండ్లకూ గంతాలు గట్టీ నోటినిండా బట్లు పెట్టీ
నిలువునా నీ తలా గొట్టీ కోట బురుజుకు గట్టీరీ || దొర ||
కాసిలో నా తల్లికేమో చావు సుద్దీ తెలిసినాదీ
కన్న కడుపే తల్లటించే గంగలోనా కలిసే || దొర || (ఆ సమయంలో నరసింహా రెడ్డి తల్లి కాశీలో ఉన్నట్లు చెబుతారు)

తెల్లదొరలను గజ గడలాడించిన రేనాటి వీరుడు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

"అదుగో వచ్చే, ఇడుగో వచ్చే నరసింహారెడ్డి
పళపళ పళపళ కేకవేసెరా నరసింహారెడ్డి
చంద్రాయుధమూ చేతబట్టెనే నరసింహారెడ్డి
..............................
ఆవుల మందలో పులి దుమికిన చందము దుమికినడూ
.......................................
కరువు వచ్చినా కొలమొచ్చినా ఆదరించే రెడ్డీ
అట్టివక్క మన రెడ్డిమాటనూ చిన్న చెయ్యరాదూ
నాలుగు గ్రామాల మందిగా తాము లేచినారు."

1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్యయుద్ధానికి పదేళ్ళముందే బ్రిటిష్ దుష్టపాలనపై తిరుగుబాటుజెండా రెపరెపలాడించిన స్వాతంత్ర్య వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
విజయనగర రాజులు తళ్ళికోట యుద్ధంలో బహమని సుల్తానుల చేతిలో ఓడిపోయారు. సామంతులుగా వుండిన పాలెగాళ్ళు తమ కత్తికి అడ్డం లేకుండా నియంతల వలె వ్యవహరింపసాగారు. రాజులమని గొప్పగా విర్రవీగేవారు.
1799లో టిప్పుసుల్తాన్ ఆంగ్లేయుల చేతుల్లో ఓడిపోయాడు. అప్పుడు రాయలసీమ నైజాం వశంలో ఉండేది. నైజాం నవాబు రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారికి అప్పగించాడు. పాలెగాళ్ళు బ్రిటిష్ వారి పాలనలోకి వచ్చారు. కడపజిల్లాలో ఆనాడు 80మంది పాలెగాళ్ళుండేవారు. వీరు ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసేవారు. దత్తమండలానికి మొట్టమొదటి కలెక్టర్ సర్ ధామస్ మన్రో. పాలెగాళ్ళ పారంపర్య హక్కులను రద్దుచేసాడు. వారికి నెలసరి ఫించన్ ఏర్పాటు చేశాడు.
ఈనాటి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ పాళెగాడు పెద్దమల్లారెడ్డి. అతని ముగ్గురు కొడుకుల్లో చివరివాడు నరసింహారెడ్డి. కోయిలకుంట్ల తాలూకా లోని ఉయ్యాలవాడ జాగీర్‌ను ఆంగ్లేయులు వశం చేసుకునే నాటికి ఆ జాగీర్ నుండి 30 వేల రూపాయలకు పైగా రెవిన్యూ రాబడి వుండేది. జాగీర్‌ను వశం చేసుకున్న తెల్లదొరలు పెద్దమల్లారెడ్డి కుటుంబానికి రు. 70 ఫించన్ ఏర్పాటు చేశారు. అందులో పెద్దమల్లారెడ్డి తమ్ముడు చిన మల్లారెడ్డికి సగంపోగా మిగతా సగం 35 రూపాయల్లో నరసింహారెడ్డికి మూడోవంతుదా 11 రూపాయలు 10 అణాలు 8 పైసలు ఫించన్ వచ్చేది. నరసింహారెడ్డి మాతామహుడైన (తల్లి తండ్రి) నొస్సం జమీందార్ జయరామరెడ్డికి ఏటా 22 వేల రూపాయల రెవిన్యూ వచ్చే జాగీర్‌ను వశం చేసుకుని నెలకు వేయి రూపాయల ఫించన్ ఏర్పాటు చేశారు. నొస్సం జమీందార్ నిస్సంతుగా మరణించడంతో ఫించన్ మొత్తం ఆపివేయబడింది.
తెల్లదొరలు క్రమంగా కట్టుబడి మాన్యాల వంశ పారంపర్య హక్కును రద్దు చేసి మాన్యాలను స్వాధీనం చేసుకోవడంతో కట్టుబడి బంట్రోతుల్లో అసంతృప్తి చెలరేగింది.
1846 జూన్ నెలలో తనకు రావలసిన మేనెల ఫించన్ పైకం కోసం, చీటి వ్రాసి కోయిలకుంట్ల ట్రెజరీకి మనిషిని పంపాడు నరసింహారెడ్డి. అదివరకు, పైకం పంపుతున్న తాసిల్దార్ ఈసారి వచ్చిన మనిషిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేకాని ఫించన్ పైకం యివ్వనన్నాడు. రెడ్డి ఉదాసీనంగా వుండటం గమనించిన తహసీల్దారు వారంట్ యిచ్చి బంట్రోతులను పంపాడు. వచ్చిన వాళ్ళను తన్ని తరిమేశాడు నరసింహారెడ్డి. ఈ విధంగా పోరాటం ఆరంభమైందంటారు.
మాన్యాలు పోగొట్టుకున్న కట్టుబడిదార్లు కొండజాతుల వాళ్ళు నరసింహారెడ్డిని ఆశ్రయించారు. నరసింహారెడ్డి నాయకత్వంలో దాదాపు 9 వేల మంది చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు జమీందార్లు పెనుగొండ, ఔకు, జమీందార్లు, హైదరాబాద్‌కు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, బనగానపల్లె నవాబ్ మహమ్మద్ ఆలీఖాన్, కొందరు బోయలు, చెంచులు, బ్రాహ్మణులు కూడా నరసింహారెడ్డి సైన్యంలో చేరారు. కంపెనీ ప్రభుత్వం నరసింహారెడ్డిపై నిఘా పెట్టింది.
1846 జూలైలో (7, 8 తేదీలు కావచ్చు) నరసింహారెడ్డి 9 వేల మంది అనుచరులతో చాగలమర్రి తాలూకా రుద్రవరం గ్రామంపై దాడి చేశాడు. మిట్టపల్లి వద్ద పోలీసులు వారిని అటకాయించారు. ఈ పోరాటంలో ఒక దఫేదారు తొమ్మిదిమంది బంట్రోతులు మరణించారు.
నరసింహారెడ్డి బృందం మరుసటి దినం కోయిలకుంట్ల ట్రెజరి పైబడి ఆనాడు ఖజానాలో వున్న, ఎనిమిది వందల అయుదు రూపాయల పది అణాల నాలుగు పైసల మొత్తాన్ని దోచుకున్నారు. తహసీల్దారు రాఘవాచారిని నరసింహారెడ్డి మనుషులు బందీగా పట్టుకున్నారు. ఖజానా సిబ్బందిని అయిదుగురిని చంపివేశారు. నరసింహారెడ్డిని పట్టుకునేందుకు పోలీసులకు సహాయంగా సైన్యాన్ని పిలిపించమని కలెక్టర్ కడపలోని కమాండింగ్ ఆఫీసరును కోరాడు. కర్నూలు నుండి గుర్రపు దళాన్ని పిలిపించారు. నరసింహారెడ్డి, ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను, చుట్టుపట్ల గ్రామాలను దోచుకున్నాడు. అప్పటికే సైన్యం జమ్మలమడుగు చేరుకున్నది. నరసింహారెడ్డి తన బృందంతో అహోబిలం కోట చేరుకున్నాడు. నరసింహారెడ్డి ఆచూకీ తీయడం ప్రభుత్వానికి కష్టమైంది. కంభం తహసీల్దారును వెంటపెట్టుకుని కడప నుండి కెప్టెన్ నాట్ పెద్ద సైన్యంతో బయలుదేరాడు. జె. ఎచ్. కొక్రీన్ మరో సైనిక దళంతో రుద్రవరం వద్ద, నాట్‌ను కలుసుకునే ఏర్పాటు చేశాడు. తిరుగుబాటు దళం గుత్తి కనుమ మీదుగా ముండ్లపాటు చేరుకుంది. అక్కడికి మూడుమైళ్ళ దూరంలోని కొత్తకోటలోని పాడుపడిన కోట, నరసింహారెడ్డికి కార్యాలయం అయింది. నరసింహారెడ్డి ప్రతి కనుమ దగ్గర కొంత కట్టుబడి సిబ్బందిని కాపలా వుంచాడు.
నరసింహారెడ్డి 5 వేల బలగంతో పాట్సన్‌ను గిద్దలూరు వద్ద అడ్డుకున్నాడు. పాట్సన్ వద్ద సైనికులు వందమందే. ఆరు గంటలసేపు నరసింహారెడ్డి మనుషులకు, పాట్సన్ సైన్యానికి భీకర పోరాటం జరిగింది. నరసింహారెడ్డి మనుషులు 200 మంది మరణించారు. చీకటి పడటతో యిరుపక్షాల వారు తమదారిన తాము వెళ్ళిపోయారు.
కొండలలోని కాలిబాటలు అడ్డదారులు సైనికులకు పరిచయం లేవు. నరసింహారెడ్డి మనుషుల కోసం సైన్యం కొండలన్నీ గాలించింది. గ్రామాధికార్ల మీద, కట్టుబడిదార్ల మీద కేసులు మోపారు.
నరసింహారెడ్డి పాలెగాణ్ణి పట్టిస్తే వేయి రూపాయలు, అతని ముఖ్య సలహాదారు గోసాయి వెంకన్నను పట్టిస్తే వంద రూపాయలు బహుమానాన్ని ఇస్తామని ప్రభుత్వ ప్రకటించింది.
నరసింహారెడ్డి తన కుటుంబాన్ని కొత్త కోటకు తరలించాడు. ప్రభుత్వ సైనికులు ఆ ప్రాంతంపై దాడి జరిపినపుడు హైదరాబాద్ రాజ్యంలోని ప్రాతకూరు జమీందారు లాల్‌ఖాన్‌కు, నరసింహారెడ్డి మధ్య జరిగిన ఉత్తరప్రత్యత్తరాలను పట్టుకున్నారు. ఆ పత్రాలు విచారణలో ప్రభుత్వానికి బలమైన సాక్ష్యాలయ్యాయి.
నరసింహారెడ్డికి ముగ్గురు భార్యల ద్వారా ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్ళూ ఉండేవారు. నరసింహారెడ్జి కుటుంబాన్ని పట్టుకుని ప్రభుత్వం, వారిని కడపలోని ఒక బంగళాలో వుంచారు. మెరుపుదాడి చేసి కుటుంబ సభ్యులను విడిపించాలని కొండలమీదుగా ప్రయాణం చేసి కడప చేరాడు నరసింహారెడ్డి.
1846 అక్టోబర్ 6వ తేదీన ఎర్రమల నలమల కొండల మధ్యనున్న పేరసామల లోని జగన్నాధాలయంలో రెడ్డి ఉన్నాడని తెలుసుకున్న కలెక్టర్ కాక్రేన్ నలుదిక్కులా సైన్యాన్ని మొహరించి 40, 50 మంది నరసింహారెడ్డి మనుషులను కాల్చి చంపారు. వందమంది దాకా గాయపడ్డారు. కాలికి గుండు దెబ్బ తగలడంతో రెడ్డి ఫిరంగి దళాలకు పట్టుబడినాడు.
నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో ఔకు రాజు తమ్ముడొకడు.
కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు. అది మామూలు శిక్ష కాదు. ఉరి తర్వాత అతని శిరస్సును కోయిలకుంట్ల దగ్గర బురుజుపై గొలుసులతో బంధించి తూకుమానుకు వేలాడదీయవలసిందిగా తీర్పు.
1827 ఫిబ్రవరి 22 న ఫలానాచోట ఉదయం 7 గంటలకు నరసింహారెడ్డిని ఉరి తీస్తారని ప్రభుత్వం వూరూరా చాటింపు వేయించింది. కాక్రేన్ ఎదుట ఉరి తీశారు.
ఆ విషాద దృశ్యాన్ని 2 వేల మంది ప్రజలు కన్నీళ్ళు రాలుస్తూ చూచారు. వారికి నోళ్ళకు బీగాలు పడ్డాయి. నరసింహారెడ్డి ప్రాణం ఉరికంబం మీద అనంతవాయువుల్లో కలిసేవరకు అతని ముఖం ప్రశాంత గంభీరంగా వుండినది.
చుట్టుప్రక్కల వారికి హెచ్చరికగా వుండాలంటూ నరసింహారెడ్డి శిరస్సును రెండు మూడు తరాల వరకు ఆ బురుజుపై వేలాడేటట్లు చేశారు ఆనాటి కిరాతకులైన తెల్లదొరలు. నరసింహారెడ్డి వంటి త్యాగమూర్తుల బలిదాన ఫలం యీనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం.
జానపదులు ఆ స్వాతంత్ర్య వీరుని అమరగాధను పాడుతూ మనలను ఉత్తేజపరుస్తున్నారీనాటికీ.

"దొరవారి నరసింహారెడ్డి
నీ దొర తనము కూలిపోయె రాజా నరసింహారెడ్డి
రేనాటిసీమలో రెడ్డోళ్ళ కులములోనా
దొరవారి వమిశానా ధీరుడే నరసింహారెడ్డి
కోయిల కుంట్లా గుట్టలెంటా కుందేరు వొడ్డులెంటా
గుర్రమెక్కి నీవు వస్తే కుంపిణికి గుండెదిగులూ
కాలికి సంకెళ్ళు వేసి చేతికి బేడీలు వేసి
పారాతో పట్టి తెచ్చి బంధికానులో పెట్టిరీ
కండ్లకు గంతలూ గట్టి నోటి నిండా బట్లు పెట్టి
నిలువునా నీ తల్లికేమో చావు సుద్దీ తెలిపినాదీ
కన్నకడుపే తల్లటించే గంగలోనా గంగ గలిసే
దొరవారి నరసింహారెడ్డి
నీ దొరతనము కూలిపోయె రాజా నరసింహారెడ్డి"


Post a Comment

0 Comments